మద్యం టెండర్‌.. ఆదాయం వండర్‌ 

20 Nov, 2021 01:23 IST|Sakshi

ఖజానాకు రూ.1,357 కోట్లు.. గత రెండేళ్లతో పోలిస్తే రూ.400 కోట్లు అధికం 

రాష్ట్రంలోని 2,620 మద్యంషాపులకు 7,849 దరఖాస్తులు 

నేడు డ్రా తీయనున్న కలెక్టర్లు..

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి మద్యం టెండర్‌లో గతంలో ఎప్పుడూలేనంతగా ఖజానాకు కాసులు రాలాయి. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకుగాను నిర్వహించిన టెండర్లలో మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చాయని ఎౖక్సైజ్‌ శాఖ వెల్లడించింది. ఇందులో దాదాపు 10 శాతం ఒక్క ఖమ్మం జిల్లా నుంచే రావడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల ద్వారా రూ.1,357 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలుగా ఉంది.

ఈసారి షాపుల సంఖ్య పెరగడంతో దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. గత టెండర్ల సమయంలో దరఖాస్తుల రూపంలో ప్రభుత్వానికి రూ.975 కోట్ల ఆదాయం రాగా, ఈసారి దాదాపు రూ.400 కోట్లు ఎక్కువగా వచ్చింది. కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఆయా జిల్లాల్లో కలెక్టర్లు శనివారం ఈ దరఖాస్తులకు డ్రా తీసేందుకు ఎక్సైజ్‌ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్రంలోని కొన్ని షాపులకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయని ఎక్సైజ్‌ శాఖ తేల్చింది.

ఇక్కడి వ్యాపారులు సిండికేట్‌ అయి తక్కువ దరఖాస్తులు వేశారనే అంచనాతో ఆయా షాపుల పరిధిలో ఏం జరిగిందన్న దానిపై స్థానిక ఎక్సైజ్‌ అధికారులతో విచారణ జరిపించాలని కమిషనర్‌ నిర్ణయించారు. విచారణ తర్వాతే ఆయా షాపులకు డ్రా తీసే కార్యక్రమం ఉంటుందని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు