ఇంటర్‌లో 30% సిలబస్‌ కోత

18 Sep, 2020 04:36 IST|Sakshi

ఇంటర్‌ బోర్డు ప్రతిపాదనకు ప్రభుత్వం ఓకే..

ఒకట్రెండు రోజుల్లో తగ్గించిన సిలబస్‌పై ప్రకటన  

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నష్ట పోయిన పనిదినాలకు అనుగుణంగా సిల బస్‌ను సర్దుబాటు చేయను న్నారు. తద్వారా విద్యార్థులు, అధ్యాప కులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాలని ఇంటర్మీడియట్‌ బోర్డు పంపించిన ప్రతిపాద నకు ప్రభుత్వం ఓకే చెప్పింది. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో సీబీఎస్‌ఈ కోత విధించిన సిల బస్‌కు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఇంటర్మీడి యట్‌లో కోత విధించనున్నారు. జేఈఈ మెయిన్, నీట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్త కుండా సీబీఎస్‌ఈ తొలగించిన పాఠాలనే రాష్ట్ర సిలబస్‌లోనూ తొలగించనున్నారు.

అలాగే హ్యుమానిటీస్‌ కోర్సుల్లో ప్రాధాన్యం తక్కువగా ఉన్న పాఠాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. పనిదినాలు గతేడాది 222 ఉంటే ఈసారి 182కు పరిమితమయ్యాయి. 40 రోజులు తగ్గిపోయాయి. అందుకు అనుగుణంగా సిలబస్‌ను తగ్గించనున్నారు. తొలగించాల్సిన పాఠ్యాంశాలపై ఇప్పటికే బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే నియమించిన సబ్జెక్టు కమిటీలు కోత పెట్టాల్సిన సిలబస్‌ను ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఖరారు చేయనున్నాయి. ఆ వెంటనే తొలగించే పాఠ్యాంశాల వివరాలను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించనుంది. మరోవైపు గత మార్చిలో జరిగిన వార్షిక పరీక్షలకు హాజరయ్యేందుకు ఫీజు చెల్లించి వివిధ కారణాలతో పరీక్షలు రాయని 27 వేల మంది విద్యార్థులను కూడా పాస్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా త్వరలోనే బోర్డు ఉత్తర్వులను జారీ చేయనుంది.

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు..
రాష్ట్రంలో ఇప్పటికే అనుబంధ గుర్తింపు పొందిన ప్రభుత్వ కాలేజీలు, సంక్షేమ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ కాలేజీలు, కేజీబీవీలు, ఫైర్‌ ఎన్‌వోసీ ఉన్న 77 ప్రైవేటు కాలేజీలు మొత్తంగా 1,136 కాలేజీల్లో ప్రవేశాలకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. మరోవైపు 1,496 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపు జారీ చేయలేదు. అయితే అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ కొనసాగుతోందని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా (www.tsbie. cgg.gov.in)అందుబాటులో ఉన్న ఈ కాలేజీల్లో చేరవచ్చని బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. ఇతర కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని పేర్కొన్నారు. 

జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై శిక్షణ..
విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, సమతుల్య జీవన శైలిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు జలీల్‌ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 10:30 గంటల వరకు దూరదర్శన్‌ యాదగిరి చానల్‌లో 16 వారాల పాటు కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు