జూన్‌ 20 నాటికి ఇంటర్‌ ఫలితాలు! 

23 May, 2022 01:41 IST|Sakshi

మూల్యాంకనం ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగం పెంచారు. వాస్తవానికి సంస్కృతం పేపర్‌ మూల్యాంకనం ఈ నెల 12నే ప్రారంభమైంది. తాజాగా ఆదివారం సబ్జెక్టుల మూల్యాంకనం చేపట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పరీశీలించారు.

కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకన విధానంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మూల్యాంకనం కోసం ఇంటర్‌ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి ఇంటర్‌ పరీక్షలు విభిన్నమైన వాతావరణంలో జరిగాయి. కోవిడ్‌ వల్ల టెన్త్‌ పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశాలు పొందారు.

ఫస్టియర్‌ పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరం కొనసాగించినా, ఆ తర్వాత మళ్లీ పరీక్షలు పెట్టారు. కానీ 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే వచ్చింది. కోవిడ్‌ వల్ల క్లాసులు జరగకపోవడం వల్లే పాస్‌ అవలేకపోయామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్‌ చేశారు. ఇప్పుడు వాళ్లంతా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరి కోసం ఇంటర్‌ బోర్డు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ అందించింది. పరీక్ష ఫలితాలను జూన్‌ 20 నాటికి వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పెడతామని తెలిపారు.  

మరిన్ని వార్తలు