ఇంటర్‌ పనిదినాలు...182 రోజులే!

11 Sep, 2020 02:40 IST|Sakshi

కరోనా నేపథ్యంలో కుదించిన ఇంటర్‌ బోర్డు

వచ్చే మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఆలస్యంగా పరీక్షలు ప్రారంభించేలా షెడ్యూల్‌ 

దసరా సెలవులు కుదింపు, 3 రోజులకే పరిమితం

సంక్రాంతి సెలవులు రెండు రోజులే..

ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ జారీ చేసిన ఇంటర్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా కారణంగా విద్యా సంవత్సర ప్రారంభం ఆలస్యం కావడంతో ఆ ప్రభావం ఇంటర్మీడి యట్‌ తరగతులు, పరీక్షల నిర్వహణపైనా పడింది. సాధార ణంగా ఏటా మార్చి మొదట్లోనే వార్షిక పరీక్షలను ప్రారంభించే ఇంటర్‌ బోర్డు ఈసారి కరోనాతో పనిదినాలు కోల్పోయిన నేపథ్యంలో 2021 మార్చిలో ఆలస్యంగా వార్షిక పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్‌ను ప్రకటించింది. 2021, మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 12 వరకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు (దూరదర్శన్, టీశాట్‌ ద్వారా వీడియో పాఠాలు) ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్‌ జారీ చేసింది.

గత మార్చి 21 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కాగా అదే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో ఆగస్టు 31 వరకు సెలవులు కొనసాగినట్లు పేర్కొంది. నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేస్తూ సెలవులను కూడా కుదించింది. సాధారణంగా 220 రోజులతో విద్యా సంవత్సరం ఉండనుండగా, ఈసారి 182 రోజుల పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది. మరోవైపు తాము ప్రవేశాల షెడ్యూల్‌ జారీ చేసిన తరువాతే కాలేజీలు ఇంటర్‌ ప్రథమ సంవత్స రంలో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని వెల్లడించింది. ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు