నూతన సాంకేతికతతో ఉద్యోగాలేమీ పోవు

21 Feb, 2023 03:37 IST|Sakshi

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నూతన సాంకేతికత వినియోగంతో ఉద్యోగాలు తగ్గిపోతాయన్న ఆందోళన అవసరం లేదని నూతన ఉద్యోగాల సృష్టి సాధ్యపడుతుందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ అన్నారు. సోమవారం తెలంగాణా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో చాట్‌జీపీటీ, జీపీటీ టూల్స్‌ అన్న అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. జూమ్‌లో వర్చ్యు వల్‌ ఆడియన్స్‌ని ఉద్దేశించి ప్రసంగించారు.

చాట్‌ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో విజ్ఞానాన్ని మెరుగుపరచడంలో సరికొత్తదని తెలిపారు. సరదా ప్రయోజనాల కోసం, సరదాగా ప్రశ్నించడం కోసం ఇది ఉపయోగ పడుతుందన్నారు. ఇటీవల తాను అత్యంత ప్రాచుర్యం పొందిన ఐదు తెలుగు సామెతలు అడగ్గా... ఇది తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో మాత్రమే కాకుండా వాటి అర్థాలను కూడా ఇచ్చిందని తెలిపారు.

విస్తారమైన డేటా నుంచి చాలా వేగంగా శోధించగల సమాచారాన్ని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ‘జయే‹శ్‌ రంజన్‌ ఎవరు? అని అడిగితే హెల్త్‌ సెక్రటరీ అని సమాధానం ఇచ్చింది, కానీ తాను ఎప్పుడూ ఆరోగ్య కార్యదర్శిగా పనిచేయలేదన్నారు.. చాట్‌ జీపీటీ మరియు జీపీటీ సాధనాలు మానవ జాతికి ఎలా సహాయపడతాయో జయేష్‌ రంజన్‌ తెలిపారు. ఈ వెబినార్‌లో చీఫ్‌ ఇన్నొవేషన్‌ ఆఫీసర్, గ్లోబల్‌ హెడ్‌ టెక్నాలజీ అడ్వైజరీ సర్వీసెస్‌ బాల ప్రసాద్, ఎఫ్‌టీసీసీఐ ఐసీటీ కమిటీ చైర్మన్‌ కె. మోహన్‌ రాయుడు తదితరులు మాట్లాడారు.  

మరిన్ని వార్తలు