మోదీజీ.. మీ మాటలు గుర్తున్నాయా?

1 Apr, 2022 03:57 IST|Sakshi

యూపీఏ హయాంలో పెట్రోల్‌ ధరలపై మోదీ ట్వీట్‌లను రీట్వీట్‌ చేసిన కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్‌ ధరలపై మోదీ చేసిన ట్వీట్‌లను ప్రధానికి గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాడు మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని చేసిన మరో ట్వీట్‌ను కూడా కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

‘మీ పూర్వపు మాటలను పునరుద్ఘాటిస్తున్నాం మోదీజీ... అంటూ ‘కేంద్ర ప్రభుత్వం విఫలం’,‘రాష్ట్రాలపై భారం’, ‘పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గుతాయి’, ‘పేదల పట్ల జాలి లేని తనం’, ‘అధికార అహంకారం’’అంటూ అప్పట్లో మోదీ చేసిన ట్వీట్‌లను రీట్వీట్‌ చేశారు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రం వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలన్నారు. ఎలాంటి సహకారంలేకున్నా ప్రచారం చేసుకోవడం ప్రధాని స్థాయికి తగదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓ జాతీయ టీవీ చానెల్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌గా ప్రచారం అయిన ‘ఈ రోజు పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూపాయి చొప్పున పెరిగాయి. 10 రోజుల్లో 9వ సారి పెరిగిన ధరలివి ’అనే ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘థాంక్యూ మోదీజీ.. ఫర్‌ అచ్చే దిన్‌’అనే హాష్‌ట్యాగ్‌ జత చేశారు.  

మరిన్ని వార్తలు