ఆసియా లీడర్ల భేటీకి  కేటీఆర్‌కు ఆహ్వానం

18 Aug, 2022 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీ నుంచి జూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్ల సిరీస్‌ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆసియా, యూరప్‌లోని అత్యంత ప్రభావశీల నాయకుల నడుమ బహిరంగ చర్చకు వీలు కల్పిస్తూ ఆసియా లీడర్స్‌ సిరీస్‌ ఒక తటస్థ వేదికగా పనిచేస్తోంది. దేశాల నడుమ భిన్నత్వం, భాగస్వామ్యాలకు మద్దతు, పరస్పర విశ్వాసంతో కూడిన సంబంధాలు మెరుగు పరచడం వంటి అంశాల్లో చర్చకు ఈ వేదిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది.

జూరిచ్‌లో జరిగే ఈ భేటీకి ఆసియా, యూరప్‌ నుంచి సుమారు వంద మంది ప్రముఖ వాణిజ్యవేత్తలు హాజరు కానున్నారు. యూరప్‌ ఆసియా కారిడార్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలపై పెరుగుతున్న రాజకీయ అస్థిరత ప్రభావంపై జూరిచ్‌ ఆసియా లీడర్ల సిరీస్‌ వేదికగా చర్చ జరగనుంది. అర్థవంతమైన చర్చకు బాటలు వేయడం లక్ష్యంగా తమ వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు రావాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ఆసియా లీడర్స్‌ సిరీస్‌ వ్యవస్థాపకుడు కల్లమ్‌ ఫ్లెచర్‌ పేర్కొన్నారు.
చదవండి: కేంద్రమంత్రిపై కస్సుమన్న హరీష్‌రావు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ 

మరిన్ని వార్తలు