సాక్షి, హైదరాబాద్: కుల, మతాలతో తాము రాజకీయం చేయబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన మల్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, తమకు కులం, మతం పిచ్చి లేదని పరోక్షంగా బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు.
శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల్లా ఉంటున్న తాము ఇదే ఒరవడి కొనసాగిస్తామని, ఎన్నికల సమయంలో తప్ప రాజకీయాలు మాట్లాడమని పేర్కొన్నారు. 2 పార్టీలకు చెందిన ఒకరిద్దరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాని, చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కోరారు. ఉప్పల్ వైపు కూడా ఐటీ పరిశ్రమలు రావడానికి చేపట్టిన లుక్ ఈస్ట్పాలసీ సత్ఫలితాలిస్తోందన్నారు.