తెగ తాగేస్తున్నారు.. 

6 Jun, 2022 01:55 IST|Sakshi

మేలో రూ. 3 వేల కోట్లు దాటిన మద్యం అమ్మకాలు

రోజుకు 2 లక్షల కేసుల బీర్లు, లక్ష కేసుల లిక్కర్‌ హాంఫట్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం ధరలు ఎంత పెరిగినా మందుబాబులు తగ్గేదేలే అంటున్నారు. మండే ఎండల్లోనూ మద్యాన్ని మస్తుగా లాగించేస్తున్నారు. మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల విలువ ఏకంగా రూ. 3 వేల కోట్లు దాటింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ. 677 కోట్ల విలువైన మద్యాన్ని లాగించగా ఆ తర్వాతి స్థానాల్లో వరంగల్‌ అర్బన్, నల్లగొండ జిల్లాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది మే 1 నుంచి 31 వరకు 55.72 లక్షల బీర్‌ కేసులు, 29.61 లక్షల లిక్కర్‌ కేసులు అమ్ముడుపోయాయి. అంటే సగటున రోజుకు 2 లక్షల బీర్‌ కేసులు, లక్ష కేసుల లిక్కర్‌ను రాష్ట్రంలోని మద్యం ప్రియలు లాగించేస్తున్నారన్న మాట. ఇక జిల్లాలవారీ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం మద్యం విక్రయాల్లో వరంగల్‌ అర్బన్, నల్లగొండ జిల్లాలు కలిపి 20 శాతానికిపైగా అమ్మకాలు జరుగుతున్నాయి.

వరంగల్‌ అర్బన్‌లో మే మొత్తంమీద రూ. 318 కోట్లకుపైగా విలువైన మద్యం అమ్ముడయింది. ఇందులో 6 లక్షల బీర్‌ కేసులు, 2.96 లక్షల లిక్కర్‌ కేసులు ఉన్నాయి. ఇక నల్లగొండలో కూడా మద్యం విక్రయాలు రూ. 300 కోట్లు దాటాయి. ఒక్క నెలలోనే ఇక్కడ 3 లక్షల లిక్కర్‌ కేసులు, 5.9 లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి.  

మరిన్ని వార్తలు