తెలుగు రాష్ట్రాల పునరేకీకరణ అసంబద్ధం 

9 Dec, 2022 03:12 IST|Sakshi

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి  

సూర్యాపేట: మీడియాలో సంచలనాల కోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పునరేకీకరణ గురించి మాట్లాడుతున్నారని, అసంబద్ధమైన అంశంపై మాట్లాడటం తెలివితక్కువతనమే అవుతుందని విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన అంశంపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వేసిన కేసు ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ఆనాడు బలవంతంగా కలిపితే 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ విభజన సాధించామన్నారు.

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర కలవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. గుజరాత్‌లో సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని, కాంగ్రెస్‌ దేశ ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్‌ ఎక్కడో పాద యాత్ర చేస్తే ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీకి ఆప్‌ ప్రత్యామ్నాయంగా అవతరించడం వల్లే విజయం సాధించిందన్నారు. తాజా ఫలితాలు దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం కావాలని తెలియజేస్తున్నాయని, అందుకే దేశ ప్రజలు కేసీఆర్‌ని ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నారని అన్నారు.   

మరిన్ని వార్తలు