ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం 

15 Jun, 2022 03:04 IST|Sakshi
ఓపెన్‌బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌    

తయారీ రంగానికి హైదరాబాద్‌ అడ్డా: కేటీఆర్‌  

మాదాపూర్‌: పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లో జాన్సన్‌ కంట్రోల్‌కి చెందిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ తయారీ రంగానికి హైదరాబాద్‌ అడ్డాగా మారిందని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ టీ–హబ్, టీ–సెల్‌ హైదరాబాద్‌లో ఉన్నాయని, ఇమేజ్‌ టవర్స్‌ సైతం ఇక్కడే నిర్మిస్తున్నామని తెలిపారు. హెదరాబాద్‌కు వస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్‌లో కార్యకలాపాలు విస్తరించిన జాన్సన్‌ కంట్రోల్‌ వీడియో సర్వైలెన్స్‌కు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయనుందని కేటీఆర్‌ తెలిపారు.

ఈ సెంటర్‌లో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు. జాన్సన్‌ కంట్రోల్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ విజయ్‌శంకరన్‌ మాట్లాడుతూ ఈ ఇన్నోవేషన్‌ సెంటర్‌ బిల్డింగ్‌ టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలను పెంపొందించే విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్‌రంజన్, జాన్సన్‌ కంట్రోల్‌ ప్రతినిధులు డేవ్‌ పుల్లింగ్, గోపాల్‌ పారిపల్లి, తజ్మీన్‌ పిరానీ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు