పోడు రైతులకు వచ్చే నెలలో పట్టాలు

12 Nov, 2022 02:51 IST|Sakshi

గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు పంపాలి

నిబంధనలు, అర్హతల ప్రకారం లబ్ధిదారులకు పట్టాలు

మంత్రి సత్యవతి రాథోడ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు వచ్చే నెలలో పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఇప్ప టికే స్వీకరించిన దరఖాస్తుల పరిశీలన యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పోడు భూముల సర్వే పూర్తి చేసి పట్టాలు సైతం సిద్ధం చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ సభలను నిర్వహించి తీర్మానం కాపీలను జిల్లా స్థాయి కమిటీలకు వెంటనే పంపాలన్నారు. విజ్ఞాపనల పరిశీలన, సర్వేలను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.14 లక్షల క్లెయిములు అందగా, అధిక శాతం క్లెయిముల వెరిఫికేషన్‌ పూర్తయిందన్నారు. అన్ని అర్హతలున్న దరఖాస్తుదారులకు పట్టాలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రిన్సిపల్‌ సీసీఎఫ్‌ డో బ్రియెల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు