అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి 

29 May, 2022 02:06 IST|Sakshi
గొర్రెల పెంపకందారుల సంఘం ప్రతినిధులతో మంత్రి నిరంజన్‌రెడ్డి 

మాంసం ఎగుమతులపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 

సాక్షి,హైదరాబాద్‌: వ్యవసాయ ఉత్పత్తులు, గొర్రె, మేక మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్పాదకతను పెంచుకుంటేనే మార్కెట్‌ డిమాండ్‌ను తట్టుకోగలమని పేర్కొన్నారు. చైనాలో ఎకరాకు వంద క్వింటాళ్లు పండిస్తే, మనదేశంలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించగలుగుతున్నామన్నారు.

మాంసమైనా, వ్యవసాయ ఉత్పత్తులైనా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడగలుగుతామని స్పష్టం చేశారు. శనివారం చెంగిచెర్లలోని మాంసోత్పత్తి జాతీయ పరిశోధన కేంద్రంను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి సందర్శించి అక్కడ మొక్కనాటారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..దేశంలో 7.5కోట్ల గొర్రెలుంటే తెలంగాణలోనే 2కోట్ల గొర్రెలున్నాయని, దేశ సగటు తలసరి మాంసం వినియోగం 6 కేజీలని, తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలుగా ఉందని తెలిపారు.  ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలు ఉందని, ఇది 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్‌ అవసరాలు తీరుతాయని మంత్రి అన్నారు. మంత్రితో పాటు మాంసోత్పత్తిపై జాతీయ పరిశోధన కేంద్రం సంచాలకుడు ఎస్‌బీ బుద్దే, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ బస్వారెడ్డి, జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.   

మరిన్ని వార్తలు