సార్‌.. నన్ను చదివించండి! 

27 Jun, 2022 01:45 IST|Sakshi
బాలుడిని ఓదారుస్తున్న  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను వేడుకున్న బాలుడు  

నవాబుపేట: మండలంలోని మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్‌ అమ్ము తున్న ఓ బాలుడిని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్లపహాడ్‌కు చెందిన మల్లెల బుజ్జమ్మ, వెంకటేష్‌ దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌ స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రతి ఆదివారం మైసమ్మ ఆలయం వద్ద కూల్‌డ్రింక్స్‌ అమ్ముతుంటాడు.

ఆదివారం అమ్ముతుండగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అలా వెళుతున్న మంత్రి బాలుడిని చూసి పలకరించాడు. ‘ఏం చదువుతున్నావ్‌?’అనగానే మంత్రి చేయి పట్టుకుని ‘సార్‌! నేను చదువుకుంటా.. నన్ను చదివించండి. ప్లీజ్‌’అంటూ విలపించాడు. వెంటనే బాలుని పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని భరోసానిచ్చారు. బాలుడిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాలలో బాలుడిని చేర్పించి, అక్కడే హాస్టల్‌ వసతి కల్పించాలని సిబ్బందికి సూచించారు. తమ కొడుకుపై మంత్రి చూపిన ఔదార్యాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు