‘భగీరథ’ ప్రయత్నం ఫలించిందా..?

22 Apr, 2022 05:28 IST|Sakshi

గ్రామాల్లో ఒక్కొక్కరికీ రోజుకు 100 లీటర్ల నీటిని సరఫరా చేయాలి

2019 కల్లా పథకం పూర్తయ్యిందంటున్న అధికారులు

రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ను పూర్తిగా పారదోలామని స్పష్టీకరణ

కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇళ్లకు భగీరథ నీళ్లందడం లేదనే వాదన

ఊళ్లలో ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లపైనే ఆధారపడుతున్న వైనం

పైప్‌లైన్లు పగలడం, లీకేజీలతో నీటి సరఫరాకు ఇబ్బందులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ ద్వారా 2019 తర్వాత ఎండాకాలంలోనూ పల్లెల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేశామని అధికారులు చెబుతు న్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఫ్లోరైడ్‌ సమస్య మిషన్‌ భగీరథతో తీరిందని చెబు తున్నారు. ఫ్లోరైడ్‌ ప్రభావిత ఆవాసాలతో పాటు తాగునీటి నాణ్యత సరిగా లేని ఇతర ఆవాసాలన్నింటికీ శుద్ధిచేసిన తాగునీటిని తెలంగాణ అందిస్తోందని 2020 సెప్టెంబర్‌లో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రకటించింది.

అయితే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, పరిశీలకులు మాత్రం ఈ పథకం అమల్లోకి వచ్చినా పూర్తిస్థాయి నీటి సరఫరా జరగడం లేదని, ఇంకా గ్రామాల్లో ఆర్వో ప్లాంట్‌లపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మిషన్‌ భగీరథ అమలు తీరు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందు లపై ‘సాక్షి’ దృష్టి సారించింది.

ఏమిటీ మిషన్‌ భగీరథ
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని (ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఆవల) ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన, సురక్షి తమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లా ద్వారా సర ఫరా చేసే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు. కృష్ణా, గోదావరి నదులు, ప్రధాన రిజర్వాయర్లు మొదలైన ఉపరితల జల వనరుల నుండి శుద్ధిచేసిన తాగునీటిని అందించాల్సి ఉంది. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో అయితే 135 లీటర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో 150 లీటర్ల తాగునీరు సరఫరా లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2015 చివర్లో మొదలుపెట్టిన ఈ పథకాన్ని 2019 కల్లా పూర్తి చేయగలిగామని అధికారులు వెల్లడించారు.  

ప్రజలు, పరిశీలకులేమంటున్నారు..
► పైప్‌లైన్లకు మరమ్మతులు సకాలంలో జరగడం లేదు. లీకేజీల సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు సందర్భాల్లో ప్రజలకు కొన్నిరోజుల పాటు భగీరథ నీళ్లందడం లేదు.
► చాలా గ్రామాల్లో ఇళ్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. 
► నేటికీ గ్రామాల్లో 2–3 ఆర్వో ప్లాంట్లు ఉంటున్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా  జరిగే నీటి అమ్మకాలు కూడా ఎక్కువే.
► మిషన్‌ భగీరథను ప్రారంభించిన గజ్వేల్‌లోనే యాభైకి పైగా ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాంటులో రోజూ సగటున 500 లీటర్లు అమ్ముతున్నారు. 

24 గంటల్లోనే సమస్య పరిష్కారం
ప్రతి గ్రామానికీ భగీరథ పైప్‌లైన్‌ చేరుకుంది. దాదాపుగా వందశాతం గ్రామాల్లోని ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతోంది. నీటి సరఫరాలో లేదా ఇతరత్రా ఏవైనా సమస్యలు తలెత్తితే 24 గంటల వ్యవధిలోనే సరిచేస్తున్నాం. లేనిపక్షంలో ఎప్పటిలోగా పరిష్కరిస్తామో చెబుతున్నాము. ఎండాకాలంలో కూడా నీటికొరత ఏర్పడకుండా చూస్తున్నాం. గతంలో షాద్‌నగర్‌లో భూగర్భ జలాలు శూన్యం. నీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని పలు కరువు పీడిత ప్రాంతాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీటిని అందజేస్తున్నాం. శుద్ధిచేసిన నీటి కారణంగా గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఇతర వ్యాధులు తగ్గిపోయాయి.     – కృపాకర్‌రెడ్డి, ఈఎన్‌సీ, మిషన్‌ భగీరథ

ఫిల్టర్‌ నీళ్ళు కొంటున్నాం..
నల్లా నీళ్ళు రావడం లేదు. నెల రోజుల క్రితం నల్లా బిగించారు. ఒకరోజు కొన్ని నీళ్ళు వచ్చినయి. గతంలో కృష్ణా జలాల ట్యాంకుల వద్ద నీళ్ళు తెచ్చుకొనే వాళ్ళం. ప్రస్తుతం ఈ ట్యాంకుల్లో నీళ్ళు ఉండటం లేదు. గ్రామా పంచాయతీ కనెక్షన్‌ ద్వారా నీళ్ళు మంచిగానే వస్తున్నాయి. తాగునీటి కోసం ఫిల్టర్‌ నీళ్ళు కొనుక్కుంటున్నం. 
– దోటి పద్మ,వావిళ్ళపల్లి గ్రామం

నీటి సమస్య తీరింది..
మా గ్రామంలో రెండేళ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బందులు పడ్డాం. కి.మీల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీ ట్యాంకు వద్దకు పోయి నీటిని తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు మిషన్‌ భగీరథ నీరు వస్తుండటంతో తాగునీటి సమస్య తీరింది. రోజూ ఉదయం గంటన్నర సేపు నీళ్లొస్తున్నాయి. 
– చెన్నమ్మ, మంచాలకట్ట,పెంట్లవెల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

మరిన్ని వార్తలు