‘అవ్వా.. మీకు భూములిప్పిస్తా.. బువ్వ తినిపిస్తా’

28 Jul, 2021 13:42 IST|Sakshi
మహిళా రైతులకు అన్నం తినిపిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

సాక్షి, గూడూరు(వరంగల్‌): ‘ మీ పోడు భూములు ఇప్పిస్తా.. అండగా ఉంటా’ అని ఓదార్చి తనకోసం తెచ్చుకున్న భోజనాన్ని అక్కడున్న మహిళా రైతులకు తినిపించాడు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని బొల్లెపల్లి శివారు వాయిల్‌బంధం సమీపంలోని పోడు భూములను పరిశీలించడానికి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మంగళవారం అక్కడికి చేరుకున్నారు. ఆ సాగు భూముల వివరాలను నాయకులు, అక్కడి రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.. అప్పటికే సమయం 10 గంటలు కావడంతో తన కారులోని టిఫిన్‌ బాక్సును తీసుకునిరా అని డ్రైవర్‌కు చెప్పాడు.

అక్కడే ఉండి ఎమ్మెల్యే మాటలు వింటున్న మహిళా రైతులు కొందరు ‘అయ్యా..ఫారెస్టో ల్లు మా భూములు గుంజుకొని మాకు బువ్వ లేకుండా చేయాలని చూస్తుర్రు, మీకైతే ఎక్కడ బడితె అక్కడికి బువ్వొస్తుంది. మా గతేంటి’ అని వాపోయారు. ఆ మాటలను విన్న ఎమ్మెల్యే.. మహిళలను చూస్తూ ‘అవ్వా..ఓ తల్లులూ..మీ భూములు ఎటూ పోవు, ఇప్పించే బాధ్యత నాది. ఇగరాండి’...అంటూ పిలిచారు. ‘మీకు భూములప్పిస్తా...బువ్వ తినిపిస్తా’నంటూ ఎమ్మెల్యే తన టిఫిన్‌ బాక్సులోని అనాన్ని ముద్దలు కలిపి తినిపించారు. ఈ సంఘటను అక్కడున్న నాయకులు, అధికారులు ఆసక్తిగా గమనించారు.

మరిన్ని వార్తలు