అత్యాచార ఘటనలపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం

8 Jun, 2022 02:07 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌/న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యాచార ఘటన లపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్‌ బాలిక అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ రాష్ట్ర డీజీపీని పూర్తిస్థాయి నివేదిక కోరింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ మంగళవారం డీజీపీ మహేందర్‌ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు.

రాష్ట్రంలో వరుసగా జరిగిన ఐదు అత్యాచార ఘటన లపై ఏడు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని కమిషన్‌ ఆదేశించింది. ఐదు అత్యాచార ఘటనల్లో ముగ్గురు మైనర్‌ బాలికలు బాధితులు కావడంతో మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనల్ని సుమోటోగా స్వీకరించినట్లు పేర్కొంది.

పోలీస్‌ శాఖ నేరాలు జరగకుండా చూసుకోవడమేకాక, ఇలాంటి అత్యాచార ఘటనల్లో నిందితులను త్వరితగతిన గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచిం చింది. ఇదే అంశంపై హైదరాబాద్‌ నగర కమిషనర్‌ సీవీ ఆనంద్‌కు సైతం మరో లేఖ రాసినట్టు రేఖ శర్మ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు