బాబోయ్‌ బార్‌.. భయపడుతున్న యజమానులు

25 Aug, 2021 10:48 IST|Sakshi

మంజూరైన వాటిలో మూడో వంతు ప్రారంభం కాని వైనం 

దగ్గరపడుతున్న ఎస్టాబ్లిష్‌మెంట్‌ గడువు 

కోవిడ్‌ కారణంగా వెలవెలబోతున్న బార్లు  

సాక్షి, సంగారెడ్డి: బార్‌షాప్‌ల లైసెన్స్‌లు పొందినవారు వాటిని ప్రారంభించేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. కోవిడ్‌ మూడో వేవ్‌ భయం వెంటాడుతుండటం, బారులో కూర్చుని మద్యం సేవించేందుకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడమే దీనికి ప్రధాన కారణం. జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు కూడా ఇంకా ప్రారంభం కాలేదు. 

కరోనా భయం వెంటాడుతోంది
► సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 22 బార్లు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం మరో 12 బార్లను మంజూరు చేసింది. జనాభా ప్రాతిపధికన ఈ కొత్త బార్లకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి మద్యం వ్యాపారుల నుంచి దరఖాస్తులు తీసుకుని డ్రా ద్వారా ఎంపిక చేసింది. 
►  డ్రాలో గెలుపొందిన వ్యాపారులు బార్‌ను ఎస్టాబ్లిష్‌ చేసుకునేందుకు మూడు నెలలు గడువుంటుంది. అయితే కోవిడ్‌ మూడో వేవ్‌పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ బార్ల లైసెన్సులు పొందిన వ్యాపారులు బార్లను ప్రారంభించడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 
► బార్ల ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం ఇచ్చిన మూడు నెలల గడువుకు తోడు మద్యం వ్యాపారులు మరో రెండు నెలల గడువు ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు నెలల అదనపు గడువు కూడా మరో పక్షం రోజుల్లో ముగుస్తుందని ఎక్సైజ్‌ అధికారులు 
పేర్కొంటున్నారు. 
►  జిల్లాకు మంజూరైన కొత్త బార్లలో కనీసం మూడో వంతు బార్లు కూడా ప్రారంభం కాలేదు. సంగారెడ్డి ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో మొత్తం నాలుగు కొత్త బార్లకు లైసెన్స్‌ మంజూరు కాగా, ఇప్పటివరకు కేవలం ఒకే ఒక కొత్త బారు తెరిచింది. 
► జీహెచ్‌ఎంసీ పరిధిలోని బార్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. డ్రాలో బార్‌ను దక్కించుకొని ఎక్సైజ్‌ ట్యాక్‌ను కట్టిన మద్యం వ్యాపారులు కొందరు తమ బార్‌ను తాము నిర్వహించకుండా, ఇతరులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  
► జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సదాశివపేట్‌ పట్టణాల్లో రెండేసి చొప్పున బార్లు మంజూరయ్యాయి. జహీరాబాద్, నారాయణఖేడ్‌లలో ఒక్కో బార్‌ మంజూరైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే అమీన్‌పూర్‌ పరిధిలో రెండు బార్లు, బొల్లారంలో నాలుగు బార్లుకు లైసెన్స్‌లు మంజూరు చేసింది.  
►  జిల్లాలో కొత్త బార్లలో ఇప్పటివరకు నాలుగు బార్లు ప్రారంభమయ్యాయని సంగారెడ్డి ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ గాయత్రిదేవి “సాక్షి’తో పేర్కొన్నారు. 
► మెదక్‌ జిల్లాలో కొత్తగా మూడు బార్లకు డ్రా తీయగా, ఇప్పటివరకు రెండు బార్లు మాత్రమే ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నాయి. రామాయంపేట్‌కు మంజూరైన బార్‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవని ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు.  

చదవండి: Afghanistan: ‘శవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడతారు’

మరిన్ని వార్తలు