ఎల్‌ఈడీ వీధిలైట్లపై వ్యతిరేకత

13 May, 2022 04:01 IST|Sakshi

బలవంతపు తీర్మానాలపై కొన్ని పంచాయతీల అభ్యంతరం 

తీర్మానాలు చేసేందుకు నిరాకరిస్తున్న సర్పంచ్‌లు  

వీధిలైట్ల నిర్వహణను తమ నుంచి తొలగిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్న వైనం 

ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసే యోచనలో సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని పంచాయతీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు సంబం ధించి బలవంతంగా తీర్మానాలు చేయించేందుకు ప్రయత్నించడంపై కొన్ని గ్రామాల సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పంచాయతీకి అవసరమనుకుంటే తీర్మానం చేస్తుంది తప్ప.. తీర్మానాలు చేయాల్సిందిగా పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యా లయం ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఈ విధంగా తీర్మానాలు చేసేందుకు కొందరు సర్పంచ్‌లు నిరాకరిస్తున్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాల విషయమై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో సర్పంచ్‌ల సంఘాలు సమావేశాలు నిర్వహించినప్పుడు వ్యతిరేకత వ్యక్తమైనట్టు సమాచారం. బలవంతపు తీర్మానాలను సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించాలని, ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టాలనే ఆలోచనలో సర్పంచ్‌లు ఉన్నారు.  

తక్కువ ఖర్చయ్యే వ్యవస్థగా మార్చేందుకు.. 
విద్యుత్‌ ఆదా చర్యల్లో భాగంగా గ్రామాల్లోని సంప్రదాయ వీధి దీపాలను విద్యుత్‌ తక్కువ ఖర్చయ్యే ఎల్‌ఈడీ వీధిదీపాల వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా వీధి దీపాల నిర్వహణ వ్యయం తగ్గి పంచాయతీలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ ప్రాజెక్ట్‌ అమ  లుకు ఆదేశాలు జారీ చేసింది.

పంచాయతీల నెలవారీ గ్రాంట్ల నుంచి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌)æ సంస్థకు బకాయిలు చెల్లించేలా తీర్మానాలు చేయాల ని సూచించింది. ఈ మేరకు ఆమోదం తెలు పుతూ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసేలా చూడాలంటూ జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది« శాఖ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు.

దీంతో డీపీవోలు తీర్మానాల కోసం సర్పంచ్‌లపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాక సంబంధి త డీపీవోలు ఈఈఎస్‌ఎల్‌ సంస్థతో ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఎల్‌ఈడీ దీపాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీలు వీటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణ బాధ్యతను తమ నుంచి తప్పించి మరొక సంస్థకు అప్పగించే ప్రయత్నాలపై సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌ఈడీ వ్యవస్థతో ఇబ్బందులు 
పంచాయతీల్లో ఎల్‌ఈడీ లైట్లు పెట్టాలంటూ రెండేళ్ల క్రితమే ఒత్తిడి తెచ్చారు. కానీ మేము ఒప్పుకోలేదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పుడు మళ్లీ తీర్మానాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి కూడా మేము అంగీకరించేది లేదు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు వీధిలైట్ల నిర్వహణ, తదితరాల్లో తేడాలుంటాయి. ఎల్‌ఈడీల నిర్వహణ బాధ్యత అప్పగించే సంస్థ ఆఫీసులు జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. ఏదైనా సమస్య తలెత్తితే సకాలంలో మరమ్మతులు చేయడం కష్టమవుతుంది. ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  
– అంజనీప్రసాద్, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు