జి–20 వర్కింగ్‌ గ్రూప్‌ భేటీకి పటిష్ట భద్రత 

18 Jan, 2023 03:17 IST|Sakshi

బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ అధ్యక్షతన సెక్యూరిటీ కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం

పాల్గొన్న వివిధ భద్రతా సంబంధ శాఖల ఉన్నతాధికారులు

లోపాలు లేకుండా సమన్వయం చేసుకోవాలని డీజీపీ ఆదేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 28 నుంచి జూన్‌ 17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జి–20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలకు తెలంగాణ పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేస్తోంది. ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జి–20 సెక్యూరిటీ కోఆర్డినేషన్‌ కమిటీలో నిర్ణయించారు.

డీజీపీ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో సీనియర్‌ పోలీస్‌ అధికారులతోపా టు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, రీజినల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీస్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, జి–20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్‌ గ్రూ పు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో 6 సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వీటిలో జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్‌ 6,7 తేదీల్లో, ఏప్రిల్‌ 26, 27, 28 తేదీల్లో, జూన్‌ 7,8,9 తేదీల్లో, జూన్‌ 15,16 తేదీల్లో జూన్‌ 17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు.  

సమన్వయం ఎంతో ముఖ్యం....  
జీ–20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు సజావుగా, భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ సూచించారు. సమావేశాలకు హాజ రయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని, సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్‌ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్‌కుమార్‌ జైన్, స్వాతిలక్రా, విజయకుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ అడిషనల్‌ సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్, డీఐజీ తఫ్సీర్‌ ఇక్బాల్, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, హోంశాఖ ఎస్‌ఐబీ డిడి సంబల్‌ దేవ్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఎస్‌ఓ భారత్‌ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ ఇందు భూషణ్‌ లెంక, ఎన్‌ఎస్‌జీ కల్నల్‌ అలోక్‌ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్‌ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు