వీడియో: అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్‌

26 Jul, 2022 09:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. నగరంలోనే కాదు.. శివారుల్లోనూ వాగులు, వంగులు పొంగిపోర్లుతుండడంతో రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది.   

జంట నగరాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. చాలా చోట్ల నీటి తొలగింపు సమస్యగా మారి.. ట్రాఫిక్‌ చిక్కులు ఎదురవుతున్నాయి. వికారాబాద్‌, శంకర్‌పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా నీరు వచ్చి చేరుతోంది. తాండూరు-వికారాబాద్, పరిగి-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.

గరిష్టంగా వికారాబాద్‌లో 12 సెం.మీ,  నగరంలో హస్తినాపురంలో వర్షపాతం నమోదు అయ్యింది. మూసారంబాగ్‌-గోల్నాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ కింద నీరు నిలిచిపోవడంతో.. ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు