-

రేషన్‌ బియ్యంలో నయా మోసం, బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ 

15 May, 2021 08:20 IST|Sakshi

కౌడిపల్లి (నర్సాపూర్‌): రేషన్‌ బియ్యం బస్తా సాధారణంగా 50 కిలోలు ఉంటుంది. కాగా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరఫరా చేసిన రేషన్‌ బియ్యం బస్తాల్లో మాత్రం ఒక్కో బస్తా ఒక్కోరకంగా ఉంటుంది. ఒక బస్తాలో 46 కిలోలు ఉండగా మరో బస్తా 40 కిలోలు మాత్రమే ఉంది. లెక్కమాత్రం 50 కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో రేషన్‌డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నష్టాన్ని తిరిగి డీలర్లు ప్రజలపైనే రుద్దుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి మే నెలకు సంబంధిం రేషన్‌ బియ్యం 70క్వింటాళ్ల 60 కిలోలు (140) బస్తాలు పంపించారు. ఇక్కడి డీలర్‌ పదవీ విరమణ చేయడంతో సమీపంలోని కొట్టల గ్రామ డీలర్‌ కిషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం బియ్యం పంపిణీ చేయగా గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజిపేట రాజేందర్‌ తదితరులు పరిశీలించారు. దీంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి వచి్చన ఒక్క బస్తాకూడ 50కిలోలు లేదు. ఒక్కో బస్తాలో 4 నుంచి 11కిలోల బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో 70క్వింటాళ్లు రావాల్సిన బియ్యం 60 క్వింటాళ్లు కూడా రాలేదు.

చర్యలు తీసుకోవాలి.. 
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి ప్రతి రేషన్‌ షాపునకు బియ్యం వస్తున్నాయి. ఒక్క వెల్మకన్న డీలర్‌కు వచ్చిన బియ్యంలోనే పది క్వింటాళ్లు తక్కువగా వస్తే జిల్లా మొత్తంలో ఇలాగే జరుగుతుంది. దీంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌వద్ద పెద్దమొత్తంలో కుంభకోణం జరుగుతుంది. దీని వెనక ఉన్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- కాజిపేట రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు 

మరిన్ని వార్తలు