సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,76,943కు చేరింది. వైరస్ బారినపడి ఒకరు మరణించగా తాజాగా 147 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3,999కు చేరుకోగా కోలుకున్న వారి శాతం 98.85గా నమోదైంది.
ప్రస్తుతం 3,787 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 25,693 కరోనా టెస్టులు చేశారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో జీహెచ్ఎంసీలో 54 కేసులు, కరీంనగర్లో 47 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
నేడు 13 మంది ‘ఒమిక్రాన్’ ఫలితాలు!
విదేశాల నుంచి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న 291 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరిలోనూ వైరస్ నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వారిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ అనుమానంతో రాష్ట్రం నుంచి ఇప్పటివరకు 13 మంది నమూనాలను పరీక్షలకు పంపగా వాటి ఫలితాలు సోమవారం వెల్లడయ్యే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.