ఎక్కడ చూసినా కరోనానే.. 

18 Jan, 2022 04:10 IST|Sakshi

గాంధీలో 70 మందికి పాజిటివ్‌ 

ఎర్రగడ్డ హాస్పిటల్‌లో 57 మందికి.. 

కరోనా బారిన పోలీసులు, పాఠశాల విద్యాశాఖ సిబ్బంది కూడా..

సాక్షి, హైదరాబాద్‌:  ఆస్పత్రులు, ఆఫీసులు, పోలీస్‌స్టేషన్లు, విద్యాసంస్థలు.. ఎక్కడ చూసినా కరోనా కలకలం రేపుతోంది. వైరస్‌ బారినపడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  
గాంధీ ఆస్పత్రిలో సోమవారం 70 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు వెల్లడించారు. 
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 57 మంది రోగులు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా ఉన్నట్టు తేలింది. వీరిలో పది మందిలోనే లక్షణాలు కన్పించినట్టు అధికారులు తెలిపారు.  
మరోవైపు ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులకు కోవిడ్‌ నిర్ధారణ అయింది.  
గ్రేటర్‌  పరిధిలో 32 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు.
పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. 

కొత్తగా 2,447 కేసులు  
రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్యా పెరుగుతున్నట్టు వైద్యారో గ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. సోమ వారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. రాష్ట్రంలో 22,197 క్రియా శీల కేసులున్నాయి. వీరిలో ఆస్పత్రుల్లో చేరినవారిలో ఆక్సిజన్‌పై 964 మంది, ఐసీయూలో 587 మంది చికిత్స పొందుతున్నారు. కరీంనగర్, వరంగల్‌ తదితర జిల్లా ఆస్పత్రుల్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లినవారు హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న క్రమంలో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. 

ఒక్క రోజులో 80,138 పరీక్షలు.. 2,447 కేసులు 
రాష్ట్రంలో సోమవారం 80,138 కరోనా పరీక్షలు చేయగా.. అందులో 2,447 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.11 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 2,295 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 96.31 శాతంగా ఉంది. తాజాగా ఒక్కరోజులో ముగ్గురు కరోనాతో చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,060కు చేరింది.  

మరిన్ని వార్తలు