TSRTC: ‘డైనమిక్‌’గా ఆలోచిస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. డీజిల్‌ ధర తగ్గితే బస్సు చార్జీలు తగ్గిస్తారా?

14 May, 2022 10:01 IST|Sakshi

ఆ దిశగా ఆర్టీసీ అడుగులు 

సెస్‌ను సవరించేందుకు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: డైనమిక్‌ ఫేర్‌ విధానం.. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జీలు పెంచుకోవడం ఎయిర్‌లైన్స్‌ సంస్థల్లో చూస్తుంటాం. పండుగల సమయాల్లో చార్జీలు రెట్టింపు చేసి వసూలు చేయటం ప్రైవేటు బస్సు ఆపరేటర్లకూ కొట్టినపిండే. ఇప్పుడు డీజిల్‌ ధరల విషయంలో ఆ తరహా విధానాన్ని అనుసరించే దిశలో టీఎస్‌ఆర్టీసీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలే డీజిల్‌ సెస్‌ కొత్త చార్జీల పెంపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.

టికెట్‌పై బస్సు కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున సెస్‌ విధించింది. ఇప్పుడు ఇందు లో ‘డైనమిక్‌’ విధానాన్ని తేవాలని భావిస్తోంది. డీజిల్‌ ధర భారీగా పెరిగినప్పుడల్లా ఈ సెస్‌నూ తదనుగుణంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో డీజిల్‌ ధర స్థిరంగా ఉంది. కొద్దిరోజుల క్రితం వారంలో మూడునాలుగు పర్యాయాలు పెరిగింది. మళ్లీ ఆ పరిస్థితి వస్తే డీజిల్‌ సెస్‌ను సవరించే లా ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
చదవండి👉 ఆల్‌నైన్‌ నెంబర్‌ @ రూ.4.49 లక్షలు 

సెస్‌ను ఎంత పెంచాలన్న విషయంలో నిర్ణ యం కూడా తీసుకునట్లు తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీ కొనే బల్క్‌ డీజిల్‌ ధర రూ.119కి చేరింది. కొద్ది రోజుల్లోనే రిటైల్‌ ధర దానికి చేరువవుతుందన్న హెచ్చరికలు మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా డైనమిక్‌ ఫేర్‌ విధానంలో డిమాండ్‌ లేనప్పుడు టికె ట్‌ధర తగ్గించడం కూడా భాగమే. మరి డీజిల్‌ ధర లు తగ్గితే సెస్‌ను ఆర్టీసీ తగ్గిస్తుందేమో చూడాలి.    
చదవండి👉🏼 గుడ్‌న్యూస్‌.. సిటీబస్సు @ 24/7

మరిన్ని వార్తలు