సాసర్‌వెల్స్‌ సక్సెస్‌; వన్యప్రాణులు ఖుష్‌

20 May, 2021 16:34 IST|Sakshi

వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఇబ్బంది రాకుండా తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ సాసర్‌వెల్స్‌ (నీటి తొట్టీలు) సత్ఫలితాలిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్‌లోని జన్నారం, ఇందన్‌పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్‌లలో సుమారు 90 వరకు నీటితొట్టీలను ఏర్పాటు చేశారు. సంబంధిత బీట్‌ అధికారి, బేస్‌క్యాంపు సిబ్బంది నీటితొట్టీల్లోని నీటిని పర్యవేక్షిస్తూ.. అయిపోగానే ట్యాంకర్ల ద్వారా నింపుతారు.


రెండు స్క్వైర్‌ కిలోమీటర్లకు ఒక నీటితొట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు తాగడానికి అనుకూలంగా ఉంటోంది. అడవిలో వాగులు, కుంటల్లో నీరు ఎండిపోతున్న నేపథ్యంలో నీటితొట్టీలు వన్యప్రాణుల దాహం తీరుస్తున్నాయి. గతేడాదివి 60 నీటితొట్టీలుండగా ఈ సంవత్సరం మరో 30 కొత్తవి నిర్మించారు. కాగా, నీరు తాగడానికి వచ్చిన వన్యప్రాణులు అధికారులు అమర్చిన సీసీ కెమెరాకు చిక్కాయి.

ఈ దృశ్యాలను పరిశీలిస్తే సాసర్‌వెల్స్‌ సత్ఫలితాలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎఫ్‌డీవో మాధవరావును సంప్రదించగా ఎప్పటికప్పుడు నీటితొట్టీలను పరిశీలిస్తున్నామని, సిబ్బంది వారానికి రెండు రోజులు నీటిని పోసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
– జన్నారం(ఖానాపూర్‌)  

మరిన్ని వార్తలు