ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తున్నాం: ఈటల

5 Oct, 2020 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీలో కొన్ని మార్పులు తెస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. లోపాలను సరిదిద్ది, ఆరోగ్యశ్రీలో రోగులను తిరస్కరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి మినహా అన్ని ఆస్పత్రుల్లో సాధారణ సేవలు మొదలైనట్లు చెప్పారు. కోవిడ్‌ డ్యూటీల్లో ఉన్నవాళ్లకు మాత్రమే క్వారంటైన్‌ సెలవులు వర్తిస్తాయని ఈటల తెలిపారు. కరోనా డ్యూటీల్లో లేని వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గిందని అయితే రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఎవరి ఇంట్లో వాళ్లే నిర్వహించుకోవాలని లేకుంటే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే కరోనాను తరిమివేయవచ్చిని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు