ఆజాద్‌ హైదరాబాద్‌

17 Sep, 2020 07:42 IST|Sakshi

చరిత్రను  మలుపు తిప్పిన వేళ అది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన సమయం అది. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన నిజాం రాచరిక పాలన శాశ్వత నిద్రలోకి  జారుకున్న సందర్భం అది. రజాకార్ల అకృత్యాలతో,అరాచకాలతో  ఎన్నో కష్టాలను, బాధలను  అనుభవించిన  ప్రజలు ఆ రోజు  స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. హైదరాబాద్‌ ఆనందంతో ఉప్పొంగింది. అడుగడుగునా త్రివర్ణ పతాకలు  రెపరెలాడాయి. బొల్లారం నుంచి  హైదరాబాద్‌ వైపు సాగిన భారత సైనిక బలగాలకు   నగర ప్రజలు  జయజయధ్వానాలు పలికారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ ఆ  రోజు జనసంద్రమైంది.

అప్పట్లో మూసీనది 
1911 నుంచి 1948 వరకు 37 సంవత్సరాల పాటు  హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలించిన  మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు తన ఓటమిని అంగీకరిస్తూ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. ‘ఆపరేషన్‌  పోలో’ విజయవంతమైంది.ఇదంతా నాణేనికి  ఒకవైపు అయితే  మరోవైపు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధికి సైతం ఆ మూడున్నర దశాబ్దాల నిజాం పరిపాలనే పునాదులు వేసింది. ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి బాటలు పరిచింది. విద్య, వైద్యం, ప్రజారోగ్యం, తాగునీరు, పారిశుధ్యం, ప్రజా రవాణా వంటి  అనేక రంగాల్లో నిజాం  నవాబు  సరికొత్త శకానికి నాంది పలికారు. రైళ్లు,రోడ్డు రవాణా సదుపాయాలు  అందుబాటులోకి వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ఆ పునాదులపైన మహానగరం  విస్తరించుకుంది. అంతర్జాతీయ ఖ్యాతిని  ఆర్జించింది.‘ సెప్టెంబర్‌  17’పై  ‘సాక్షి’  ప్రత్యేక కథనం ఇది.

మీర్‌ ఆలం చెరువు 

హైదరాబాద్‌ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య  సెప్టెంబర్‌ 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్టినెంట్‌ జనరల్‌ మేజర్‌ రాజేంద్రసింగ్‌ నేతత్వంలో మేజర్‌ జనరల్‌ జేఏ చౌదరి దీనికి సారధ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి  హైదరాబాద్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది.షోలాపూర్‌ నుంచి బయలుదేరిన  సైన్యం నల్‌దుర్గ్‌ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు వచ్చింది. మేజర్‌ జనరల్‌ డీఎస్‌ బ్రార్‌  ముంబై నుంచి, ఆపరేషన్‌న్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఏఏ రుద్ర  విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్‌ శివదత్త  బేరార్‌ నుంచి  బయలుదేరారు. అన్ని వైపుల నుంచి  భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది.

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ 
భారత వైమానిక ఎయిర్‌ మార్షల్‌ ముఖర్జీ సైతం  తన సేవలను అందజేసేందుకు  సన్నద్ధమయ్యారు. దీంతో  నిజాం మనుగడ ప్రశ్నార్ధకమైంది.1948 సెప్టెంబర్‌ 14వ తేదీన దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్,  సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం  తన స్వాధీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్‌ ప్రాంతాలలో  నిజాం సైనికులపై  భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్‌ 16వ తేదీన రాంసింగ్‌ నేతత్వంలోని సైనికులు  జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు యూనియన్‌న్‌ సైనికులపాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్, తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్‌ ఇద్రూస్‌ చేతులెత్తేశారు. గత్యంతరం లేక   ఏడో  నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్‌ 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు.

కాసీం రజ్వీ, ఆజాం జా
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌... 
నిజామ్‌ ప్రభువుల కాలంలో ఉన్నత వర్గాల వారి  కోసం, నవాబులు, జాగీర్‌దార్లు, బ్రిటీష్‌ అధికారుల పిల్లల చదువుకోసం 1923లో ‘జాగీర్‌దార్‌ స్కూల్‌’ పేరుతో ప్రస్తుత హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటైంది. లండ¯Œన్‌ లోని ఎల్టన్‌ కళాశాల భవనం తరహాలో దీన్ని నిర్మించారు.  అద్భుతమైన  డిజైన్లతో పూర్తిగా డెక్కన్‌ తరహా నిర్మాణ శైలితో పాఠశాల భవనాలను నిర్మించారు. బ్రిటీష్‌ విద్యావేత్త షాక్రాస్‌ మొదటి ప్రిన్సిపల్‌గా 1924లో 5 గురు విద్యార్థులు, ఆరుగురు అధ్యాపకులతో పాఠశాల మొదటి బ్యాచ్‌ ప్రారంభమైంది.1950లో ప్రభుత్వం జమీందారి వ్యవస్థను రద్దు చేయడంతో  హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌  ఉనికిలోకి వచ్చింది.   మొదట్లో  బాలురకు మాత్రమే  పరిమితమైన పాఠశాలలో  1988 అమ్మాయిలకు ప్రవేశం కల్పించారు.

పికెట్‌ట్యాంక్‌( నాడు) జూబ్లిబస్టాండ్‌ (నేడు) 
సిటీ కళాశాల..
ఆకుపచ్చ వనంలో వెలసిన  రాజభవనంలా ఉంటుందా  అరుణసౌధం. మూడంతలస్తుల భవనం.అరవై నాలుగు గదులు, విశాలమైన ఆవరణ.దారులకు ఇరువైపులా నిలువెత్తు వృక్షరాజాలు.. ఇదీ  హైదరాబాద్‌ సిటీ కాలేజ్‌ అద్భుత దృశ్యం. అనేక సంవత్సరాలుగా, అనేక  తరాలుగా విద్యనందజేస్తోంది. 1865లోనే మొట్టమొదటి ‘దారుల్‌ –ఉల్‌–ఉలుమ్‌’పాఠశాలగా  ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌  హయాంలో  ప్రారంభమై 7వ నిజాం  ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో 1920 నాటికి  గొప్ప కళాశాలగా అభివృద్ధి చెందింది. ఇండో–సార్సెనిక్‌ శైలిలో   మూసి నది తీరాన  ముస్లిం జంగ్‌ బ్రిడ్జ్‌కు సమీపంలో  కట్టించిన  సిటీ కళాశాల   ఒక రాజమందిరాన్ని  తలపిస్తూంటుంది.

చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌
మహబూబియా బాలికల కళాశాల  
న్యూ జనానా అంటే హైదరాబాద్‌లో చాలామందికి తెలియకపోవచ్చు. ఒకప్పటి ‘పరదా స్కూల్‌’ కూడా అంతే. చదువులకు దూరంగా ఉన్న బాలికలను బడిబాట పట్టించేందుకు  ప్రారంభమైన పాఠశాలే  పరదా స్కూల్‌. అదే న్యూ జనాన. ఆ తరువాత  ఆ  స్కూలే  మహబూబియా బాలికల పాఠశాలగా,  కళాశాలగా  అభివృద్ధి చెందింది. ఆబిడ్స్‌ రోడ్డులో  కనిపించే  నిలువెత్తు రాతికట్టడం. ఏ  రాణివాసమో అనిపించేలా అద్భుతమైన నిర్మాణశైలి. ఆరో నిజాం  హయాంలో నిర్మించిన ఈ విద్యా మందిరానికి  ఆయన పేరే పెట్టారు.
 
ఆర్ట్స్‌ కళాశాల ప్రారంభోత్సవం 
ఉస్మానియా విశ్వవిద్యాలయం  
దార్‌–ఉల్‌–ఉలూం పేరిట 1913లో ఆనాటి విద్యార్థులంతా ఒక సంఘంగా ఏర్పడి నగరంలో విశ్వ విద్యాలయం తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం 1917లో ఒక ‘ఫర్మానా’ జారీ చేసింది. మీర్‌ ఉస్మాన్‌ఆలీఖాన్‌ పేరిట 1918లో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రొఫెసర్‌ పాట్రిక్‌ గెడ్డెస్‌ నేతృతత్వంలో రామంతాపూర్, జమిస్థాన్‌పూర్, హబ్సిగూడ, అంబర్‌పేట్, లాలాగూడ గ్రామాల్లో 2400 ఎకరాల భూమిని వర్సిటీ కోసం సేకరించారు. బీదర్, గోల్కొండ, అజంతా, ఎల్లోరా, ఢిల్లీ తదితర ప్రదేశాల్లోని భారతీయ శిల్పకళా సంపదను, సంస్కతులను మేళవించి ఆర్ట్స్‌ కళాశాల  భవనం నమూనాను రూపొందించారు.

నయాపూల్‌ 
1934 జులై 24న పునాది పడింది.110 మీటర్ల వెడల్పు, 119 ఎత్తున రెండంతస్తుల్లో 164 విశాలగదులతో ఆర్ట్స్‌ కళాశాల రూపుదిద్దుకుంది. కాలేజీలోని ప్రధాన హాలు 24/ 24 మీటర్ల పొడవు, వెడల్పుతో, 12 మీటర్ల ఎత్తున సున్నంతో చేసిన  ఫిలిగ్రీ పనితనం కనిపిస్తుంది. 1939 డిసెంబర్‌ 5న మీర్‌ ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ విశ్వవిద్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఆపరేషన్‌  పోలో లో భాగంగా.. 
వారసులంతా విదేశాల్లోనే
ఇదీనిజాం..‘ఖాన్‌’దాన్‌ 
కుతుబ్‌షాహీల తర్వాత హైదరాబాద్‌ రాజధానిగా పాలించిన అసఫ్‌జాహీల ఆనవాళ్లు నగరంలో వీధివీధికీ కనిపిస్తాయి. 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్‌ స్టేట్‌ను మీర్‌ ఖమ్రుద్దిన్‌ ఖాన్, నిజాంఅలీ ఖాన్, అక్బర్‌అలీ ఖాన్, ఫరూకుద్దీన్‌ అలీఖాన్, తినాయత్‌ అలీఖాన్, మీర్‌ మహబూబ్‌ అలీఖాన్, మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌లు పాలించారు. మహబూబ్‌ లీఖాన్, ఉస్మాన్‌ అలీఖాన్‌ల పాలనా సమయంలో నగరం అనేక మైలు రాళ్లను దాటేసింది. 1948 సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్‌ పోలోతో హైదరాబాద్‌ సంస్థానం అంతరించి దేశంలో కలిసిపోయింది. అయినా ఉస్మాన్‌ అలీఖాన్‌ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా పదవులు నిర్వహించారు.

ఎంజే మార్కెట్‌కు శంకుస్థాపన 
ఆస్ట్రేలియాలో ఎనిమిదవ నిజాం : 
నిజాం వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముఖర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్‌లో స్థిరపడ్డారు. అడడపాదడపా హైదరాబాద్‌ వచ్చి వెళుతున్నారు. వీరిలో ముఖరం జా ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎనిమిదవ నిజాంగా ప్రకటించుకున్న ముఖర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్‌నామా, చౌమహల్లా, చిరాన్‌ ప్యాలెస్‌లున్నాయి.లండన్‌ డూన్‌ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుంచి పట్టాలు అందుకున్న ముకర్రం జా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్‌ 6, 1933లో పుట్టిన ముఖరం జా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959–75),  అనంతరం ఎయిర్‌హోస్టెస్‌ హెలెన్‌(1980–90).. ఆపై  అప్పటి మిస్‌ టర్కీ మనోలియా ఒనోర్‌ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాలు ‘తలాఖ్‌’ చెప్పేశాడు.

ముఖర్రం ఝా , ముఫకం ఝా 
ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్‌ ఒర్చిడ్‌లను కలిసి ఉంటున్నాడు. మొత్తంగా చూస్తే మొదటి భార్య ద్వారా ఇద్దరు(కూతురు, కొడుకు), రెండో భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడవ భార్య కూతురు(నీలోఫర్‌), నాల్గవ భార్య ద్వారా ఓ కుమార్తెలు ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో స్థిరపడ్డారు.  ముఫకం జా  మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండవ మనవడు. ఇతను   ప్రస్తుతం లండన్‌లో నివాసముంటున్నారు.  టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకం జా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ మ్యూజియాల నిర్వహణను చూస్తున్నారు.  

నిజాం..ది రిచెస్ట్‌మ్యాన్‌ 
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉస్మాన్‌ అలీఖాన్‌ది ప్రముఖమైన పేరు.  హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 23వేల ఎకరాల(సర్ఫెఖాస్‌) భూములతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా,మహేబలేశ్వరం, తదితర ప్రాంతాల్లో ఉన్న 630  భవనాలు, భూములను ప్రైవేటు ఆస్తులుగా గుర్తిస్తూ అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి సీఎస్‌ వెంకటాచారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే చౌమహల్లా, ఫలక్‌నామ, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్‌విల్లా, ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ప్లజెంట్‌ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర ,వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమైయ్యాయి. అయితే ఈస్తుల పరిరక్షణకు ట్రస్ట్‌లు ఏర్పాటు చేసి, అందులో ప్రభుత్వ ప్రతినిధులు సైతం సభ్యులుగా చేర్చింది. దీంతో  ‘ది నిజామ్స్‌ ట్రస్ట్‌ డీడ్స్‌(వాలిడేషన్‌) యాక్ట్‌ 1950’. మేరకు 28 రకాల ట్రస్ట్‌లు ఏర్పడ్డాయి. ఈ ట్రస్టులకు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా, సభ్యులుగా నిజాం కుటుంబసభ్యులతో పాటు మాజీ సివిల్‌ సర్వీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. 

1947 ఆగస్టు15 దేశమంతా స్వతంత్ర జెండాలెగిరితే..హైదరాబాద్‌లో మాత్రం నిజాం రాజుకు వ్యతిరేకంగా నిలబడ్డ యోధుల తలలు తెగాయి. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌ యూనియన్‌లో కలపకుండా స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో పావులు కదిపిన మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏడాది కాలం పాటు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెల్లువెత్తిన సాయుధ రైతాంగ గెరిల్లాలను, మరో వైపు సత్యాగ్రహంతో రోడ్డెక్కిన కాంగ్రెస్‌ సమూహాల్ని ఏడాది పాటు నిలువరించగలిగాడు. చివరకు భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు మూడువైపులా చుట్టుముట్టిన సమయంలో నిస్సహాయంగా మిగిలిన నిజాం అప్పటి హోంమంత్రి పటేల్‌ ముందు మోకరిల్లటంతో..ఆజాద్‌ హైదరాబాద్‌ అవతరించింది..లొంగుబాటు అనంతరం హైదరా బాద్‌ సంస్థానధీశులు ఎవరెక్కడ ఉన్నారు.. వారేం చేస్తున్నారు..వివరాలివీ  

నిజాముల పరివారం 
చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  
కుమారులు : ఆజంజా, మౌజం జా, కూతురు మహ్మద్‌ ఉన్నీసా బేగం 
ఆజంజా జా పరివారం :
భార్య, దుర్రేషెవార్‌(టర్కీ),కుమారులు : ముకర్రం, ముఫకం జా 
మౌజం జా పరివారం :  భార్యలు నీలోఫర్‌(టర్కీ), రజియాబేగం,అన్వరీబేగం 
సంతానం : ఫౌతిమా,ఫాజియఅమీనా,ఓలియా,శ్యామత్‌అలీఖాన్‌ 

మరిన్ని వార్తలు