స్పష్టమైన వైఖరి తెలపండి: విద్యార్థుల డిమాండ్‌

6 Jul, 2021 09:57 IST|Sakshi

మంత్రి సబిత నివాసం ముట్టడించిన విద్యార్థులు

డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం శ్రీనగర్‌ కాలనీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అంతకుముందు సత్యసాయి నిగమాగమం నుంచి సబిత నివా సం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా సబిత జోక్యం చేసుకుని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

విద్యార్థి నాయకులతో మాట్లాడి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్షా కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే విద్యార్థులు ఆ సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. స్పష్టమైన వైఖరి తెలపాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు.

ఓయూ డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కంట్రోలర్‌ 
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఓయూ  పరిధిలో ఈనెల 8 నుంచి ప్రారంభంకానున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కంట్రోలర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ సోమవారం తెలిపారు. కరోనా వ్యాప్తి కారాణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 8 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఈనెల 27 నుంచి 6, 1 సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ వెబ్‌సైట్లో పరీక్షల టైం టేబుల్‌ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గతంలో జారీచేసిన హాల్‌టికెట్లు, ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయన్నారు.  

మరిన్ని వార్తలు