రేపు కేబినెట్‌ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్‌

10 May, 2021 19:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద ఎత్తున కేసుల నమోదు, మరణాలు పెరగడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. కరోనా వైరస్‌ ప్రధాన అజెండాగా ఉండే అవకాశం ఉంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడం.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం వంటి చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. అయితే లాక్‌డౌన్‌పై కూడా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు లాక్‌డౌన్‌పై ఏదో విషయం స్పష్టం చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే సీఎం కె.చంద్రశేఖర్‌ రావు మాత్రం లాక్‌డౌన్‌ ఉండదని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచి సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రజలు చచ్చిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదా’ అని ప్రశ్నిస్తున్నారు. ‘దేశమంతా లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. పక్క రాష్ట్రాలు కూడా లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మీరెందుకు ప్రకటించారు?’ అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రివర్గంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

లాక్‌డౌన్‌ పెట్టాలా? వద్దా? అని చర్చించి ప్రజలకు ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా కరోనా పరిస్థితులపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశం కీలకం కానుంది. రేపు సాయంత్రం ఏదో ఒక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. వీటితోపాటు ధాన్యం కొనుగోలుపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.

చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
చదవండి: కుప్పకూలిన ప్రభుత్వం.. విశ్వాసం కోల్పోయిన ఓలి

మరిన్ని వార్తలు