యూపీ ఎన్నికల తర్వాత మళ్లీ బాదుడే!

7 Feb, 2022 01:28 IST|Sakshi
ఎలక్ట్రిక్‌ ఆటో నడుపుతున్న మంత్రి హరీశ్‌రావు

కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడం ఖాయం 

మంత్రి హరీశ్‌రావు ధ్వజం  

సిద్దిపేటజోన్‌: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నిజస్వరూపం మళ్లీ బహిర్గతం కానుందని, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్‌ ధరలను మరో పది రూపాయలు పెంచడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ‘బట్టే బాజ్‌.. ఝూటే బాజ్‌ పార్టీ బీజేపీ’అని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు బీజేపీ చేసే గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రైతులకు ఇచ్చే అన్ని సబ్సిడీలను తగ్గించి వారికి భద్రత లేకుండా చేసిం దని కేంద్రం తీరుపై మండిపడ్డారు. సబ్సిడీ తగ్గడంతో ఎరువుల ధరలు పెరుగుతాయన్నారు. విద్యుత్‌ చట్టంలో సవరణలు చేయాలని, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ మీటర్లను పెట్టాలని కేంద్రం మెలిక పెట్టిందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, గొంతు లో ప్రాణం ఉన్నంతవరకు వాటిని పెట్టబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టంగా చెప్పార న్నారు. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు వడ్లు కేంద్రమే కొన్నదని, కానీ యాసంగిలో వడ్లు కొనబోమని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెప్పడం రైతుకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. కేంద్రలో బీజేపీ ప్రభుత్వం వల్ల వాతలు, కోతలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు.  

మరిన్ని వార్తలు