ప్రజా ఉద్యమంలా హరితహారం

9 Sep, 2021 01:46 IST|Sakshi

డ్రోన్‌ ద్వారా సీడ్‌బౌల్స్‌ చల్లే కార్యక్రమం ప్రారంభం

భువనగిరి: 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మొ దలుపెట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌ శాంతికుమారి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్‌ మెషీన్‌ ద్వారా సీడ్‌బౌల్స్‌ను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల కాలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, రాష్ట్రంలో 5 శాతం గ్రీన్‌బెల్ట్‌ పెరిగిందని పేర్కొన్నారు.

2030లోగా 1 బిలియన్‌ సీడ్‌బౌల్స్‌ ప్లాంటేషన్‌ చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది అభయారణ్యాల్లో డ్రోన్‌ ద్వారా ప్లాంటేషన్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడానికి వీల్లేని ప్రాంతాలు, కొండలపై డ్రోన్‌ ద్వారా సీడ్‌బౌల్స్‌ వెదజల్లుతున్నామని, సంవత్సరం తర్వాత శాటిలైట్‌ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు. అంతకుముందు మండలంలోని హన్మాపురం, తుక్కాపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పమేలా సత్పతి, సీసీఎఫ్‌ అక్బర్, అడిషనల్‌ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, డీఆర్‌డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు