ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత 

18 Oct, 2021 01:30 IST|Sakshi

‘నర్సరీ రాజ్యానికి రారాజు’పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి   

సాక్షి, హైదరాబాద్‌: ప్రకృతిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందుకోసం యువతరం కంకణబద్ధులై ముందుకు కదలాల్సిన అవసర ముందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ఎమెస్కో బుక్స్‌ ప్రచురించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు’– పల్ల వెంకన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా పల్ల వెంకన్న కుటుంబ సభ్యులకు, ప్రచురణకర్తలకు, పుస్తక రచయిత వల్లీశ్వర్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలిపారు.

పల్ల వెంకన్న శక్తి అసాధారణమైనదని, ఐదో తరగతి వరకే చదువుకున్నా, శరీరం పూర్తిగా సహకరించని పరిస్థితుల్లో ఉన్నా ప్రకృ తి విజ్ఞానాన్ని ఔపోసన పట్టి వృక్ష శాస్త్రవేత్తలకు సైతం సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. పర్యావరణం– ప్రగతిని సమ న్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పల్ల వెంకన్న తన దివ్యాంగత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడ్డారని, ఆ నిబద్ధతే అర ఎకరా నర్సరీని 40 నుంచి 50 ఏళ్ళలో వం దెకరాల స్థాయికి చేర్చిందని తెలిపారు.

వెంకన్న దేశమంతా తిరిగి దాదాపు మూడువేల రకాల మొక్కల్ని సేకరించి నర్సరీని అభివృద్ధి చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, పార్లమెంట్‌ మాజీ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్, ఎమెస్కో బుక్స్‌ సీఈవో విజయకుమార్, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, పుస్తక రచయిత వల్లీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు