ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయండి

9 May, 2022 00:56 IST|Sakshi
పార్టీ కార్యాలయంలో మాట్లాడుతున్న షర్మిల 

వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం: షర్మిల 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ధరకు వడ్లు కొనుగోలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కేవలం ఒక్కరిద్దరికే మద్దతు ధర ఇస్తున్నారని, మిగతా వారి నుంచి తక్కువ ధరకే వడ్లు కొంటూ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో షర్మిల మాట్లాడారు.

‘రైతుల నుంచి వడ్లు కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరి వేసిన రైతులు అతలాకుతలమవుతున్నారు. రైతన్నలు పంట వేయకపోతే మనం అన్నం కాకుండా గడ్డి తినాలా’అని షర్మిల నిలదీశారు. మద్దతు ధర కూడా ఇవ్వని సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాడేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రను సైతం పక్కన పెట్టానన్నారు. పంట బీమానే కాదు.. పంట నష్ట పరిహారం కూడా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. 

మరిన్ని వార్తలు