తెగ తాగి.. అడ్డంగా దొరికేశారు.. 4,448 మంది బుక్కయ్యారు

2 Jan, 2022 13:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసలే ఇయర్‌ ఎండ్‌.. కొత్త ఏడాది ఆరంభ ఘడియ.. జనాల్లో అంతులేని జోష్‌.. పట్టరాని సంతోషం.. ఇంకేముంది కొందరు తెగ తాగారు. కిక్కు ఎక్కిన తర్వాత కొత్త ఏడాదికి స్వాగతం చెబుతూ రోడ్డెక్కారు..  పోలీసులు ఎదురుపడే సరికి వారికి చుక్కలు కనిపించాయి. అంతే, దెబ్బకు మత్తు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ శాఖ నిర్వహించిన ప్రత్యేక డ్రంకన్‌ డ్రైవుల్లో 4,448 మంది పోలీసులకు చిక్కారు. వారంతా రేపో మాపో కోర్టు మెట్లక్కనున్నారు.

నిత్యం జరిపే డ్రంకన్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి కూడా దాటని కేసుల సంఖ్య డిసెంబర్‌ 31 అర్ధరాత్రి దాటిన తర్వాత ఏకంగా 4 వేలు దాటడం గమనార్హం. పోలీస్‌ శాఖ హెచ్చరికలను సైతం ధిక్కరించి మందుబాబులు రోడ్డెక్కడంతో హైదరాబాద్‌లో ఒక్కరోజే 1,200 మంది పట్టుబడి టాప్‌లో నిలవగా, ములుగు పట్టణం ఒక్క కేసు కూడా లేకుండా చివరన నిలిచింది. కమిషనరేట్ల వారీగా... సైబరాబాద్‌ 870, రాచకొండ 360, వరంగల్‌ 274, రామగుండంలో 253 చొప్పున, సూర్యాపేట జిల్లాలో 176  చొప్పున కేసులు నమోదయ్యాయి. 
చదవండి: బంజారాహిల్స్‌: తూలుతూ.. తేలుతూ.. యువతి రచ్చ..

మరిన్ని వార్తలు