స్కూళ్లు, థియేటర్లపై నిర్ణయం వాయిదా 

8 Oct, 2020 02:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కుల పునఃప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లను తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడంతో పాటు అక్టోబర్‌ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులను 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరవడానికి అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ గత నెల 30న ‘అన్‌లాక్‌–5’ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా రాష్ట్రంలో అన్‌లాక్‌–5 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పాఠశాలలు, సినిమా థియేటర్లు పునఃప్రారంభించాల్సిన తేదీలను ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని ఇందులో పేర్కొన్నారు.

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు.. 

  • కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల లాక్‌డౌన్‌కు ముందు అనుమతించిన అన్ని కార్యక్రమాలను ఇకపై అనుమతిస్తారు. అయితే, కింద పేర్కొన్న కార్యక్రమాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ప్రామాణిక నిబంధనల (ఎస్‌ఓపీ)కు లోబడి అనుమతిస్తారని తెలిపింది. 
  • కళాశాలలు/ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్‌లైన్‌/దూరవిద్యకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించాలి. ఉన్నత విద్యా సంస్థలు కేవలం ల్యాబ్‌లు అవసరమున్న పీహెచ్‌డీ, సాంకేతిక/వృత్తి విద్యా కోర్సుల పీజీ విద్యార్థుల కోసం అక్టోబర్‌ 15 నుంచి తెరవడానికి అనుమతిస్తారు. ఇందుకు పీహెచ్‌డీ విద్యార్థులు, సైన్స్‌ అండ్‌ టెక్నాల జీ కోర్సుల పీజీ విద్యార్థులకు ల్యాబ్‌లు అవసరముందని కేంద్రం నుంచి నిధులు అందుకుంటున్న ఉన్నత విద్యా సంస్థల అధిపతి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. 
  • ఎస్‌ఓపీను పాటిస్తూ క్రీడాకారుల శిక్షణకు ఉపయోగించే స్విమ్మింగ్‌ పూల్స్, వాణిజ్య ఎగ్జిబిషన్ల (బిజినెస్‌ టు బిజినెస్‌)కు అక్టోబర్‌ 15 నుంచి అనుమతిస్తారు.  
  • సామాజిక/విద్య/క్రీడలు/వినోద/సాంస్కృతిక/మతపర/రాజకీయ కార్యక్రమా లు, సమావేశాలను 100 మందికి మించకుండా కంటైన్మెంట్‌ ప్రాంతాలకు వెలుపలి ప్రాంతాల్లో అనుమతిస్తారు. వివాహాది కార్యక్రమాలు, అంత్యక్రియలు, సంబంధిత కార్యక్రమాలకు 100 మందికి లోబడి అనుమతిస్తారు. ఖాళీ ప్రాంతాల్లో మైదా నం పరిమాణాన్ని దృష్టిలో పెట్టు కుని అన్ని జాగ్రత్తలు పాటి స్తూ అధిక మంది పాల్గొనడానికి కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ఎస్పీలు /స్థానిక సంస్థలు అనుమతిస్తాయి. 
  • కంటైన్మెంట్‌ జోన్లలో అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు అనుమతి స్తారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఉధృతంగా కాంటాక్ట్‌లను గుర్తించి, ఇంటింటి మీద నిఘాతోపాటు ఇతర అవసరమైన వైద్యప ర చర్యలు తీసుకుంటారు. జోన్లకు బయట కరోనా వైరస్‌ వ్యాప్తికి అవకాశమున్న బఫర్‌ జోన్లను గుర్తించి జిల్లా అధికారులు ఆంక్షలను విధించవచ్చు.  
మరిన్ని వార్తలు