KCR-Bandi Sanjay: ఆసుపత్రిలో సీఎం కేసీఆర్‌.. బండి సంజయ్‌ స్పందన ఇదే..

11 Mar, 2022 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆయనను యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాగా.. ఆస్పత్రిలో కేసీఆర్ సిటీ స్కాన్, యాంజీయోగ్రామ్, ఇతర వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.

అనంతరం సీఎం కేసీఆర్‌కు యాంజియోగ్రామ్‌ టెస్టులు పూర్తి అయినట్లు, గుండెలో ఎలాంటి బ్లాక్స్‌ లేవని యశోద వైద్యులు వెల్లడించారు. యాంజియోగ్రామ్‌ టెస్టులు నార్మల్‌గానే వచ్చాయని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్‌ ఎంవీ రావు వెల్లడించారు. ఈ సందర్భంలోనే సీఎం కేసీఆర్‌కు ప్రతీ ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. ప్రస్తుతం సీఎం ఆరోగ్యం స్టేబుల్‌గా ఉందని స్పష్టంచేశారు.

కేసీఆర్‌ అస్వస్థతకు గురైన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. ట‍్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, రాజకీయాల్లో వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో కేసీఆర్‌ ఆరోగ్యంపై స్పందిస్తూ మొట్టమొదటి సారిగా బండి సంజయ్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

>
మరిన్ని వార్తలు