ఈ దొంగకు మాన్షన్‌ హౌస్‌ అంటే ప్రాణం? ఖరీదైన మద్యం బాటిళ్లు ఉన్నా...

7 Oct, 2021 08:57 IST|Sakshi

సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : అశ్వారావుపేటలోని ఓ వైన్స్‌లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. కేవలం చోరీ అయితే మామూలు విషయమే కావొచ్చు కానీ ఈ చోరీకి ఓ ప్రత్యేకత ఉంది. చోరీకి పాల్పడింది ఒకరో, ఇద్దరో తెలియదు కానీ దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. రానున్న దసరాకు అమ్మకాలు జోరుగానే సాగుతాయనే భావనతో భారీగా స్టాక్‌ తెప్పించినట్లు సమాచారం.
చదవండి: హుజురాబాద్‌ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం..

అయితే, వైన్స్‌షాపులో సీసీ కెమెరాలు ఉండగా.. వైర్లను కత్తిరించిన నిందితులు లోపలికి ప్రవేశించారు. షాపులో వివిధ రకాల ఖరీదైన బ్రాండ్ల మద్యం ఉన్నా... కేవలం మాన్షన్‌ హౌస్‌ బ్రాందీ సీసాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఇక వెళ్లిపోయే క్రమంలో వైన్స్‌లోని సీసీ కెమెరాల పుటేజీ హార్డ్‌ డిస్క్‌ కూడా ఎత్తుకెళ్లడం విశేషం. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్రరావు, ఎస్సై చల్లా అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని కొత్తగూడెం నుంచి క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
చదవండి: Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి..

నెల రోజుల క్రితం ఊట్లపల్లిలో..
నెల రోజుల క్రితం మండలంలోని ఊట్లపల్లి గ్రామం వద్దగల మద్యం దుకాణంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. లక్ష విలువైన మద్యం అపహరించారు. కాగా ఈ రెండు చోరీ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు మద్యం చోరీ జరగడం గమనార్హం. చోరీ ఘటనలపై స్థానిక ఎస్సై చల్లా అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా..చోరీ జరిగినట్లు సమాచారం ఉందని, కానీ వాటిపై బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు