సాక్షి, హైదరాబాద్: ఇవి దాదాపు వెయ్యేళ్ల క్రితం నాటి శిల్పాలు.. దేవతా మూర్తులు, వీరగల్లుల విగ్రహాల సమూహం. రోడ్డు విస్తరణకు అవి అడ్డుగా ఉన్నాయని భావించిన ఓ కాంట్రాక్టర్ వాటి మీదుగా మట్టి వేసి అలాగే రోడ్డు నిర్మాణం ప్రారంభించేశాడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పోల్కొంపల్లి గ్రామంలో ఇది జరిగింది. కొందరు గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న విశ్రాంత పురావస్తు అధికారి, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి సోమవారం గ్రామాన్ని సందర్శించారు.
వివిధ సందర్భాల్లో వెలుగుచూసిన కళ్యాణి చాళుక్యుల హ యాం క్రీ.శ.11వ శతాబ్దం నాటి దేవతామూర్తుల, స్థానిక వీరుల శిల్పాలు అరుదైనవని ఆయన అంటున్నారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన వాటిని నిర్లక్ష్యంగా పూడ్చేయడం సరికాదని, తక్షణమే శిల్పాలను సురక్షిత ప్రాంతానికి తరలించి పరిరక్షించాలని ఆయన కోరుతున్నారు. ఆయన వెంట నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు పట్నం కృష్ణంరాజు, భూత్పూరు ఆలయ కమిటీ సభ్యుడు అశోక్గౌడ్ తదితరులున్నారు.
చదవండి: Maoist Party : హిడ్మా, శారద క్షేమమే