ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన ముగ్గురు జవాన్లు 

26 Feb, 2023 05:36 IST|Sakshi

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ అటవీప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, డీఆర్జీ బలగాలు జేగురుగొండ నుంచి దండకారణ్య అటవీ ప్రాంతంలో రోజువారీ గాలింపుల్లో ఉండగా కందేడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపారు.

ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయపడిన వారిని వెంటనే క్యాంప్‌కు తరలించి వైద్యమందించారు. రెండు ఏకే 47 తుపాకులు, 51 ఎంఎం మోరా్టర్‌ను మావోయిస్టులు అపహరించారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులంటున్నారు. వారి కోసం భారీగా కూంబింగ్‌ చేపట్టినట్టు బస్తర్‌ రేంజ్‌ ఐజీపీ సుందర్‌రాజ్‌ చెప్పారు.

ఆర్మీ జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు 
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో శనివారం ఓ ఆర్మీ జవాన్‌ను మావోయిస్టులు హతమార్చారు. జిల్లాలోని బడెతెవాడకు చెందిన జవాన్‌ మోతీరామ్‌ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సమీపంలోని ఉసేలీ వారపు సంతలో కోడి పందేలు చూస్తుండగా ముగ్గురు మావోయిస్టులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు.

మరిన్ని వార్తలు