Hyderabad: 90 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, ఎందుకంటే?

14 Nov, 2021 17:19 IST|Sakshi

ఆర్టీసి బస్సులు,ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు,లారీలు, డీసీఎంలకు అనుమతి లేదు

బహదూర్‌పురా మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో అమలు  

పురానాపూల్‌ నుంచి ఆరాంఘర్‌ వైపు భారీ వాహనాలకు అనుమతి లేదు

లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌ యథావిధిగా వెళ్లవచ్చు

ట్రాఫిక్‌ పోలీసుల ఆదేశాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా జంక్షన్‌లో మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌ దారి మళ్లింపు కొనసాగుతుందని సంబందిత ట్రాఫిక్‌ పోలీసులతో పాటు జీహెచ్‌యంసీ ప్రాజెక్ట్‌ విభాగం ఇంజినీరింగ్‌ అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ డీసీపీ ట్రాఫిక్‌ ఆంక్షలపై ఆదేశాలు జారీ చేయగా..ప్రస్తుతం సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ సైతం ఆదేశాలు జారీ చేశారు. గతకొంత కాలంగా బహదూర్‌పురా జంక్షన్‌లో మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ పనుల్లో భాగంగా గ్రేడ్‌ సపరేటర్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 
ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాలపై 90 రోజుల పాటు ఆంక్షలు విధించనున్నారు.  
ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.  
తొంబై రోజుల పాటు వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. 
కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతించడం లేదని...లైట్‌ మోటార్‌ వెహికిల్స్‌ను యధావిధిగా అనుమతించనున్నామని పోలీసు అధికారులు తెలిపారు.  
ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి బహదూర్‌పురా ద్వారా పురానాపూల్‌ చేరుకునే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. 
బెంగుళూర్‌ హై వే కావడంతో ఈ రోడ్డులో టీఎస్‌ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీఎస్‌ఆర్టీసీ, కేఎస్‌ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.  
వీటికి తోడు  ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలు నడుస్తుంటాయి. 
భారీ వాహనాలు బహదూర్‌పురా చౌరస్తా మీదుగా కాకుండా మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ, మహబూబ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు, చాంద్రాయణగుట్ట, డీఎంఆర్‌ఎల్, మిధాని, ఐ.ఎస్‌.సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ద్వారా నల్గొండ క్రాస్‌ రోడ్డుకు చేరుకునేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..)

కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎప్పటి లాగే పురానాపూల్‌ నుంచి ఆరాంఘర్‌ చేరుకోవచ్చు. 
పాతబస్తీలో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు ఆరాంఘర్‌ వెళ్లడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలను   సూచిస్తున్నారు. 
ఆయా వాహనాలు దారుషిపా, పురానీహవేలీ, బీబీబజార్‌ చౌరస్తా,షంషీర్‌గంజ్,ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి,చాంద్రాయణగుట్ట చౌరస్తా ద్వారా ఆరాంఘర్‌ చేరుకోవడానికి వీలుంటుందన్నారు.  
మరో మార్గమైన నల్లొండ క్రాస్‌ రోడ్డు ద్వారా ఆరాంఘర్‌ వెళ్లాల్సి ఉంటుందంటున్నారు.  
90 రోజుల పాటు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు. 
ఇప్పటికే హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పురానాపూల్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  
బహదూర్‌పురా చౌరస్తా వద్ద జరిగే మల్టీ లెవల్‌ ఫ్లై ఓవర్‌ గ్రేడ్‌ సెపరేటర్‌ నిర్మాణ పనుల సందర్భంగా అటు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధి లోని ట్రాఫిక్‌ డీసీపీ... ఇటు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ట్రాఫిక్‌ డీసీపీ భారీ వాహనాలపై ట్రాఫిక్‌ ఆంక్షలను కొనసాగించనున్నారు.      

మరిన్ని వార్తలు