సాంబార్‌ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో.. 

6 Sep, 2022 10:03 IST|Sakshi
గోకుల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద గొడవ జరుగుతున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇడ్లీలోకి సాంబార్‌ అడిగినందుకు ఓ కస్టమర్‌పై టిఫిన్‌ సెంటర్‌ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్‌నగర్‌ రంగాభుజంగా సినిమా థియేటర్‌కు ఎదరుగా ఉన్న గోకుల్‌ టిఫిన్‌ సెంటర్‌కు సోమవారం ఉదయం ఉపేందర్‌రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్‌ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్‌ కావాలని హోటల్‌ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు.

ఈ విషయంలో ఉపేందర్‌రెడ్డి, హోటల్‌ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్‌ పనిచేస్తున్న కాలీదాస్‌ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్‌లో టోల్‌ట్యాక్స్‌ రద్దు 

మరిన్ని వార్తలు