‘టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది’

17 Sep, 2020 17:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అంతరాష్ట్ర సర్వీసులపై ఇప్పటి వరకు 3సార్లు చర్చలు, సమావేశాలు జరిగాయని తెలంగాణ మజ్ధూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. అయినా టీఎస్‌ఆర్టీసీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు నడుపుకోమన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి స్పందన లేదన్నారు. బస్సులు లేకపోతే కొనేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే టీఎస్‌ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ బస్సులను ప్రొత్సహించే విధంగా ఉందని అర్ధమవుతోందన్నారు. (తెలంగాణకు బస్సులపై నేడు మరోసారి భేటీ)

‘ఆర్టీసిని రక్షించుకుంటాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుకుంటే బస్సులు కొనడం ఇబ్బంది ఏం కాదు. కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. ఓ వైపు ఇరు రాష్ట్రాల మధ్య ప్రైవేట్ బస్సులు నడుస్తూ లాభాలు గడిస్తుంటే ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీకి రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని’ హనుమంతు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు