గుడ్ న్యూస్ : నేటి నుంచి 50 శాతం బస్సులు

23 Nov, 2020 18:43 IST|Sakshi

 జంట నగర ప్రయాణీకులకు శుభవార్త.నేటి నుంచి గ్రేటర్‌లో 50 శాతం బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: ఒక వైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందడి పుంజుకుంటోంది.మరోవైపు జంటనగరవాసులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 శాతం బస్సులు  రోడెక్కాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  దీంతో నగరంలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సుల  సర్వీసుల సంఖ్య పెంచామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలో 25శాతం బస్సులు మాత్రమే నడిచిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం బస్సులు తిప్పుతున్నట్లు తెలిపిన గ్రేటర్ ఆర్టీసీ వెల్లడించింది. అలాగేబస్ పాస్ కౌంటర్లను కూడా 26కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 నుండి రాత్రి 8.15 వరకు  బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా కరోనా వైరస్‌ లాక్​డౌన్ తర్వాత ప్రజా రవాణాకు కేంద్రం పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినప్పటికీ తెలంగాణాలో  వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా  25 శాతం బస్సులకు మాత్రమే అనుమతినిచ్చింది.  కేసుల సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గిందంటూ సర్కార్‌ తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్టీసీ ఆదాయం  భారీగా పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.  మరోవైపు గత ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన సినిమా రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు.

మరిన్ని వార్తలు