కొత్త వ్యవసాయ చట్టాలపై సినీ దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్సీసీ, ఎస్ఎఎంల పిలుపుమేరకు శనివారం నిర్వహించిన ఛలో రాజ్భవన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
అంతకుముందు ఇందిరాపార్కు నుంచి రాజ్భవన్కు ర్యాలీగా బయల్దేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ నాయకులు ఆజీజ్పాషా, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు పశ్యపద్మ, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, సీఐటీయూ రమ, వివిధ సంఘాల నేతలు ఎస్ ఎల్ పద్మ, అనురాధ ఉన్నారు.