Revanth Reddy: కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై రేవంత్‌రెడ్డి కౌంటర్‌

8 Apr, 2023 18:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా నోటీసులకు నోటీసులతోనే కౌంటర్‌ ఇచ్చారు. తనకిచ్చిన లీగల్‌ నోటీసులు వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్‌కు సంబంధం లేదని.. ఆసమయంలో ఆయన దేశంలో లేనందున ఆ బాధ తెలియదని అన్నారు.

టీఎస్‌పీఎస్‌సీకి టెక్నికల్‌ సపోర్ట్‌ అంతా ఐటీశాఖ అందిస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు కేటీఆర్‌ తనకు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్‌ రెడ్డి నియామకం కూడా ఐటీశాఖ ద్వారానే జరిగిందన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల తరపున మాట్లాడానని చెప్పారు. పేపర్‌ లీకేజీపై హైకోర్టులో పిటిషన్‌ వేశామని.. ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశామని తెలిపారు. 

కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని టీపీసీసీ రేవంత్ రెడ్డికి,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తనపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.
చదవండి: బండి సంజయ్ చొరవ.. బీజేపీ కార్యాలయ సిబ్బందిని కలిసిన మోదీ

మరిన్ని వార్తలు