Revanth Reddy: కల్వకుంట్ల కవితకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌.. అది మర్చిపోయారా అంటూ..

29 Mar, 2022 12:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ట్వీట్ల వార్‌ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌ నేతలు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.

ధాన్యం కొనుగోలు విషయంపై రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్‌ చేశారు.

దీనికి ప్రతిగా.. టీఆర్‌ఎస్‌ తరపున కల్వకుంట్ల స్పందించారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల‌కు ఒక నీతి, ఇత‌ర రాష్ట్రాల‌కు మ‌రో నీతి ఉండ‌కూడ‌ద‌ని రాహుల్‌ గాంధీ’’ని విమర్శించారు.

దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. ట్విట‍్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌కు, కవితకు కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌లో.. ‘‘కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్‌లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇది చదవండి: రాముడు కాదు.. వాళ్లు రావణుడి భక్తులు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు