వీడియో: కలిస్తే నవ్వొద్దా భయ్‌.. పొద్దున తిట్టుకుంటాం! సాయంత్రానికి..

2 Dec, 2022 21:25 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య  నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్‌ అండ్‌ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్‌బ్రాండ్స్‌. ఈ క్రమంలో.. 

ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు.  సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. 

మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు.  కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్‌ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు.  ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్‌ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్‌, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. 

మరిన్ని వార్తలు