కేసీఆర్‌కు లేఖ రాసిన రేవంత్‌ రెడ్డి.. ఏమన్నారంటే?

31 Dec, 2022 16:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. ఇందులో భాగంగా తెలంగాణలో రైతుల సమస్యలు పత్తి ధర, రుణమాఫీ గురించి ప్రధానంగా చెప్పుకొచ్చారు. 

వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్‌కు శనివారం రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు. లేఖలో పత్తికి మద్దతు ధర, రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులను దళారులు దగా చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్‌ లేఖలో డిమాండ్‌ చేశారు. 

ఇక, కొద్దిరోజుల క్రితం పత్తికి 9వేలకు పైగా ధర ఉండగా.. ప్రస్తుతం పత్తి ధర 7వేలకు పడిపోయింది. దాదాపు 2వేల రూపాయలు తగ్గడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారులు సిండికేట్‌గా మారి పత్తి ధరను తగ్గించి రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

>
మరిన్ని వార్తలు