ఈటల అవినీతిలో టీఆర్‌ఎస్‌కు భాగస్వామ్యం

23 Oct, 2021 04:24 IST|Sakshi

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌  

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని, మాజీమంత్రి ఈటల రాజేందర్‌ అవినీతిలో టీఆర్‌ఎస్‌కు కూడా భాగస్వామ్యం ఉందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ ఆరోపించారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడబోమని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఈటల ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్‌ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజూ పెంచుతున్నందుకు బీజేపీకి ఓటేయాలా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని, దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారని మహేశ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ విద్యార్థి, నిరుద్యోగులకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని.. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడిన వ్యక్తిని గెలిపించాలని కోరారు. 

మరిన్ని వార్తలు